రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఈ స్కూల్ నిర్మాణ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ స్థలంలో కూలీల సంఖ్యను తక్షణమే పెంచి పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి, అధికారులకు సూచించారు.
లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలి
అనంతరం చందుర్తి మూడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో 'వన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గరిమ అగర్వాల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ శాఖ తమకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, నాటిన ప్రతి ఒక్క మొక్కను బాధ్యతాయుతంగా సంరక్షించాలని పిలుపునిచ్చారు.


