నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టాలు రోజురోజుకూ పడిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు పూర్తయినప్పటికీ ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టుకు ఒక్క చుక్క కూడా వరద నీరు వచ్చి చేరకపోవడంతో సాగర్ డెడ్ స్టోరేజీకి చేరువైంది.
513 అడుగుల వద్ద నీటిమట్టం
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 513 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. కొత్తగా వరద నీరు రాకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగిస్తున్నారు.
తాగునీటికే ప్రాధాన్యం.. ఆరుతడి పంటలే శ్రేయస్కరం
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాగర్ నుంచి కేవలం హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం మాత్రమే అధికారులు రోజుకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటంతో, సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఈ ఏడాది వరి వంటి నీటి తీవ్రత ఎక్కువ ఉన్న పంటలకు బదులుగా కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు.


