న్యూఢిల్లీ: పార్లమెంట్లో విద్యార్థులు, యువత సమస్యలపై చర్చించే ధైర్యం విపక్షాలకు లేదని, సభకు వస్తే తమ ద్వంద్వ వైఖరి ప్రజల ముందు బయటపడుతుందనే భయంతోనే వెనకడుగు వేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
నీట్పై సభలో బహిరంగ సవాల్
విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యలతో పాటు ప్రతిష్టాత్మక 'నీట్' (NEET) వ్యవహారంపై పార్లమెంట్ ఫ్లోర్లో బహిరంగంగా చర్చించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందన్నారు. "మేము విపక్షాలకు బహిరంగ సవాల్ విసురుతున్నాం. పార్లమెంట్ వేదికగా నీట్, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చకు రండి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం" అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నాయకులు చర్చల నుంచి పారిపోవడం వారి పాత అలవాటేనని దుయ్యబట్టారు. సభలో బాధ్యతాయుతంగా చర్చించడం మానేసి ప్రచార రాజకీయాలు చేయడమే వారి చరిత్ర అని విమర్శించారు.


