మణుగూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ప్రకాశ్ ఖని ఓపెన్కాస్ట్ బొగ్గు గనిని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలు, గని పనితీరు మరియు భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
డీఏవీ పాఠశాల ప్రారంభం – నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం
సమీక్ష అనంతరం భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్షిప్లో నూతనంగా ఏర్పాటు చేసిన డి.ఏ.వి. (DAV) పాఠశాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. సంస్థ ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు యాజమాన్యం చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముక
కొత్త బొగ్గు గనుల కేటాయింపునకు జరిగే వేలం ప్రక్రియలో సమగ్ర కార్యాచరణతో పాల్గొని కొత్త బ్లాకులను సొంతం చేసుకోవాలని అధికారులకు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముక వంటిదని కొనియాడారు. సంస్థ అభివృద్ధి, కొత్త బొగ్గు బ్లాకుల సాధన, ఉత్పత్తి సామర్థ్యం పెంపు మరియు ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.


