కొత్తగూడెం: సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను మరింత ఆధునికీకరించే దిశగా కీలక అడుగు పడింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం రాత్రి వైభవంగా ప్రారంభించారు.
పరిశోధనా పరికరాల పరిశీలన
ప్రారంభోత్సవం అనంతరం ఉప ముఖ్యమంత్రి లేబరేటరీలోని అత్యాధునిక పరికరాలను స్వయంగా పరిశీలించారు. బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల విశ్లేషణ మరియు భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులతో వివరంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లేబరేటరీ విశేషాలను అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నూతన జియో సైన్స్ లేబరేటరీ అందుబాటులోకి రావడం వల్ల ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత పరిశీలన మరియు భూగర్భ శాస్త్ర పరిశోధనలు అత్యంత వేగవంతంగా, కచ్చితత్వంతో నిర్వహించే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఆధునిక గనుల నిర్వహణకు ఊతం
శాస్త్రీయ పరిశోధనలకు ఈ లేబరేటరీ గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని, ఆధునిక గనుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సేవలు మరింత మెరుగుపడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


