ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బంజారా, లంబాడ తండాలలో సాంప్రదాయ శీత్లా పండగ వేడుకలు అత్యంత అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా జిల్లాలోని లింగాపూర్ మండలం కొత్తపెళ్లితో పాటు సిర్పూర్(యు) మండల పరిధిలోని వివిధ తండాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామ శివారులో శీత్లా దేవికి విశేష పూజలు
పండుగ సందర్భంగా తండావాసులంతా ఏకమై గ్రామ శివారు ప్రాంతానికి చేరుకుని శీత్లా దేవి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు రోహిదాస్ మాట్లాడుతూ.. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం గ్రామానికి ఎలాంటి ఆపదలు రాకుండా, గ్రామస్థులు, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజలు నిర్వహిస్తామని వివరించారు.
పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రార్థన
ఈ ఏడాది వర్షాలు అనుకూలించి రైతాంగానికి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు గిరిజన నాయకులు తెలిపారు. బంజారా మహిళలు తమ సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తండాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, లంబాడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.


