యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపై 'వర్ష పాశుపత వరుణ యాగం' నిర్వహిస్తున్నారు. కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ యాగ ప్రక్రియలు సాగుతున్నాయని ఆలయ ఈఓ భవాని శంకర్ వెల్లడించారు.
రెండో రోజు ప్రత్యేక పూజలు
యాగంలో భాగంగా రెండో రోజు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండపారాధనలు, పారాయణాలతో పాటు శివపంచాక్షరీ మూలమంత్ర జపం, విరాటపర్వ పారాయణం, వరుణ మూలమంత్ర జపం, అగ్ని ప్రతిష్ఠ పూజలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు.
రాష్ట్ర సుభిక్షం కోసం ఆరాధన
ప్రకృతి అనుకూలించి సకాలంలో వర్షాలు కురిస్తేనే వ్యవసాయం వృద్ధి చెందుతుందని, అందుకే శాస్త్రోక్తంగా ఈ వరుణ యాగాన్ని తలపెట్టినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.


