పెద్దకొత్తపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమం వేడుకగా జరిగింది. గ్రామానికి చెందిన వస్త్రాల రాధిక-ఆంజనేయులు, మద్దని ఎర్రబుడ్డన్నల ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్దకొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇండ్లను ప్రారంభించారు.
తొలి విడతలో 50కి పైగా గృహాలు
ఈ సందర్భంగా సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ.. పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక సహకారంతో వెన్నచర్ల గ్రామానికి మొదటి విడతలోనే 50కి పైగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని తెలిపారు. గ్రామంలో సుమారు 200 ఇండ్ల అవసరం ఉందని, రెండవ, మూడవ విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధికి ప్రజలు తోడ్పడాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు వాస్తవాలను గ్రహించి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి. సత్యం, సింగిల్ విండో చైర్మన్ బి. శ్రీనివాస్, నక్కలపల్లి సర్పంచ్ మొట్టే కురుమయ్య, కొత్తపేట సర్పంచ్ మానస రాకేష్, ఉపసర్పంచ్ బై రాముడు, నాగర్ కర్నూల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగపురి విష్ణు, మాజీ ఎంపీపీ వరదరాజుల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ డి. రవికుమార్, హౌసింగ్ ఏఈ రాజవర్ధన్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, నాయకులు, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.


