కొల్లాపూర్: కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం 'వనమంచు పల్లె పాటలు' పుస్తకావిష్కరణ మహోత్సవం జరిగింది. కవి కల్వకోలు మద్దిలేటి రచించిన ఈ పాటల పుస్తకాన్ని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు.
సామాజిక చైతన్యానికి పాటలే సాధనం
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పల్లెల జీవన విధానాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని రక్షించే రచనలు, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పాటలు అద్భుతమైన సాధనమని అభినందించారు. ఎన్నో చారిత్రాత్మక ఉద్యమాలకు పాటలే ఊపిరిగా నిలిచాయని గుర్తుచేశారు.
రచయితలకు ప్రభుత్వ పూర్తి సహకారం
తెలంగాణ ప్రభుత్వం కవులకు, రచయితలకు అన్ని విధాలా అండగా ఉండి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. కల్వకోలు మద్దిలేటిని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి, భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని పుస్తకాలను ప్రచురించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కల్వకోలు ఉపసర్పంచ్ గువ్వలి చిన్న కుర్మయ్య, మాజీ ఎంపీటీసీ ఎం. లక్ష్మీనారాయణ, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ వి. పరుశరామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పస్పుల నరసింహ, ఉల్లంగొండ శివశంకర్, కొండూరు సర్పంచ్ కేతూరు ధర్మతేజ, నూనె క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


