హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, వారి సతీమణి అనితా మహానా మర్యాదపూర్వకంగా సందర్శించారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణానికి విచ్చేసిన యూపీ స్పీకర్ దంపతులకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు.
యూపీ స్పీకర్ దంపతులకు ఘన సన్మానం
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీష్ మహానా దంపతులను శాలువా, పుష్ప గుచ్ఛంతో సత్కరించి, అసెంబ్లీ జ్ఞాపికను (మెమెంటో) అందజేశారు.
సభా నిర్వహణపై ఇరువురి చర్చ
అనంతరం ఇరువురు స్పీకర్లు సమావేశమై తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వహణ, సభా సంప్రదాయాలు, డిజిటలైజేషన్, శాసన నిర్మాణ ప్రక్రియలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల అసెంబ్లీల పనితీరు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకున్నారు.
ఈ సమావేశంలో శాసనమండలి (కౌన్సిల్) సెక్రటరీ డాక్టర్ వి. నరసింహాచార్యులు, శాసనసభ (అసెంబ్లీ) సెక్రటరీ రేండ్ల తిరుపతితో పాటు శాసనసభకు చెందిన ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.


