హైదరాబాద్ (సచివాలయం): ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎల్-నినో (El-Nino) ప్రభావం, దాని వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పర్యావరణ మార్పుల వల్ల రైతులకు పంట నష్టం వాటిల్లకుండా ఉండేందుకు శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్ర మొట్టమొదటి 'కంటింజెన్సీ ప్రణాళిక' (Contingency Plan)ను వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం (జూలై 16) సచివాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని అన్ని విభాగాల అధిపతులు (HODs), వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్ల్లా, మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయిలో ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే అంశంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల కోసం సమగ్ర గైడ్లైన్ బుక్ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
వర్షపాతం లోటు గుర్తింపు: రాష్ట్రంలోని ప్రతి మండలం, జిల్లా వారీగా వర్షపాతం లోటు (Rainfall Deficit) వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఆయా ప్రాంతాల్లోని తీవ్రతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ వ్యూహాలు అమలు చేస్తారు.
ముందస్తు అంచనాలు: రానున్న రెండు నెలలకు సంబంధించిన వాతావరణ మార్పుల అంచనాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటికి తగిన పరిష్కారాలను ఈ కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచారు.
'ఐఎండీ' సమాచారంతో రైతులకు నిరంతర సూచనలు
భారత వాతావరణ శాఖ (IMD) అందించే ఉపగ్రహ సమాచారాన్ని రోజువారీ, వారంవారీ, నెలవారీగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఈ డేటాను నిరంతరం పర్యవేక్షిస్తూ, వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా నేరుగా రైతులకు చేరవేసేలా డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఏయే పంటలను ఎంపిక చేసుకోవాలి, అందుబాటులో ఉన్న తక్కువ నీటిని ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవాలి, తక్కువ వర్షపాతంలో సాగు నిర్వహణ ఎలా చేపట్టాలనే విషయాలపై శాస్త్రవేత్తల ద్వారా రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంట నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, నీటిపారుదల శాఖలు పూర్తి సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.


