ఆసిఫాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని బొక్కివాగు ప్రాజెక్టు కుడి కాలువ గేటు గత కొన్ని సంవత్సరాల క్రితం విరిగిపోయింది. దీంతో విలువైన సాగునీరు వృథాగా పోతుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సొంత నిధులతో యుద్ధప్రాతిపదికన పనులు

ఈ సమస్య సిర్పూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు దృష్టికి రాగానే ఆయన తక్షణమే స్పందించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా, తన సొంత ఖర్చులతో గేటు మరమ్మతు పనులను చేపట్టారు. ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన ఈ మరమ్మతులు పూర్తి చేయించారు.

మరమ్మతులు పూర్తయిన అనంతరం శనివారం ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రాజెక్టు వద్దకు చేరుకుని, కుడి కాలువ గేటును పైకెత్తి సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తక్కువ సమయంలోనే పనులను పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం

నీటి విడుదల అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసమే తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. "ప్రస్తుతం వర్షాలు లేక ఆశించిన స్థాయిలో పంటలు పండని పరిస్థితి ఉంది. ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో బొక్కివాగు ప్రాజెక్టు నీరు విడుదల కావడం వల్ల స్థానిక ఆయకట్టు పరిధిలోని పంటలకు ఎంతో మేలు జరుగుతుంది" అని ఆయన పేర్కొన్నారు. వృథా పోకుండా విడుదల చేసిన సాగునీటిని రైతులందరూ పొదుపుగా, సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు చప్పిడే రవీందర్, భక్తు రామచందర్, బీజేపీ మండల అధ్యక్షుడు కుకిడే రాజేశ్వర్, ఇరిగేషన్ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను సొంత నిధులతో పరిష్కరించిన ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Jul 2026 | 01:38 PM IST
Tags: