షాద్నగర్: పట్టణ ప్రధాన చౌరస్తాలోని మహనీయుల విగ్రహాల చుట్టూ ఏర్పాటు చేసిన అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంతో ఆ ప్రాంతం పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మారింది. విగ్రహాల వద్ద ప్రచార హోర్డింగులు నింపేయడం వల్ల రహదారిపై విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న స్థానికుల ఆందోళనపై అధికారులు వేగంగా స్పందించారు.
తీరిన ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారుల హర్షం
ముఖ్యంగా రద్దీ సమయాల్లో బ్యానర్ల కారణంగా ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోవడంతో వాహనాల రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయని వాహనదారులు, పాదచారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాల చుట్టూ ఉన్న క్లియర్ వ్యూ వల్ల ప్రమాదాల తీవ్రత కూడా గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.
అధికారుల చర్యలపై స్థానికుల ప్రశంసలు
మహనీయుల విగ్రహాలు రాజకీయ, వ్యక్తిగత ప్రచారాలకు వేదికలు కాకుండా స్ఫూర్తి కేంద్రాలుగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ప్రయోజనాలను, భద్రతను దృష్టిలో ఉంచుకుని సమయస్ఫూర్తితో స్పందించిన మున్సిపల్ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసుల చర్యలను అభినందించారు. ప్రజా ప్రదేశాల్లో అనధికార ఫ్లెక్సీల నియంత్రణపై ఇదే తరహా కఠిన చర్యలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.


