రంగారెడ్డి: జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 136 ఫిర్యాదులు నమోదైనట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
శాఖల వారీగా వినతుల వివరాలు
ప్రజావాణికి అందిన అర్జీలలో భూములు, వ్యక్తిగత సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చేవి 54 కాగా, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందినవి 82 ఉన్నాయి. ప్రజలు అందజేసిన ప్రతీ వినతిపత్రాన్ని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నేరుగా స్వీకరించి, ఆయా సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్జీలను సంబంధిత అధికారులకు పంపిస్తూ తక్షణ చర్యలకు ఆదేశించారు.
గడువులోగా సమస్యల పరిష్కారం: కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు, బాధ్యతలు ఉంటాయని, అధికారులు మానవీయ కోణంలో స్పందించాలని సూచించారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, శాఖల మధ్య సమన్వయంతో సేవలందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, డీఆర్ఓ శారద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


