నల్లగొండ: అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులు, ఎల్నినో (El Nino) ప్రభావం కారణంగా జిల్లాలో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ సంస్థలపై ప్రత్యేక నిఘా
వర్షాభావ పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా నిరుపేదలు, గర్భిణులు, విద్యార్థులు ఉండే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు (జీజీహెచ్), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించాలని సూచించారు.
తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించేందుకు మండల స్థాయి అధికారులు ప్రతి రెండు వారాలకు ఒకసారి క్షేత్రస్థాయిలో హాస్టళ్లు, పీహెచ్సీలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో తేలిన లోపాలు, నీటి లభ్యతపై సమగ్ర నివేదికలను తయారు చేసి స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్కు క్రమం తప్పకుండా సమర్పించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.


