హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి.సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాలు మరియు సంతకాలలోని లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి సరిచేయాలని స్పష్టం చేశారు. అదనపు సీఈవో డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఏఎస్ తో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గైర్హాజరైన (Absent), నివాసం మార్చుకున్న (Shifted), మరణించిన (Dead), నకిలీ (Duplicate) ఓటర్ల (ASDD) జాబితాలను క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించాలని సీఈవో ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా పొరపాటున తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలు ఉన్నచోట రోల్బ్యాక్ (Roll-back) సదుపాయాన్ని వాడుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సీఈవో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారుల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనను మరింత బలోపేతం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బీఎల్ఓ సమావేశాల వివరాలను గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల బీఎల్ఏల సంతకాలతో సిద్ధం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే 85 ఏళ్లు పైబడిన ఓటర్ల వివరాల సవరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు విభజించబడకుండా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, ఈఆర్ఓలు మరియు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు.


