మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా సరిహద్దుల్లో జల వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. భీమా నదిపై పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, చెక్డ్యామ్ల వల్ల తెలంగాణకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతోందని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సమరశంఖం పూరించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సరిహద్దులోని గూడూరు బ్యారేజ్ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటక నిండింది.. తెలంగాణ ఎండింది అనే ప్రధాన నినాదంతో సాగిన ఈ నిరసన ప్రదర్శనలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. భీమా నదిపై ఎగువన కర్ణాటక ప్రభుత్వం సాగిస్తున్న నిర్మాణాల కారణంగా దిగువన ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి
ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర నీటి వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవడంలో ఉదాసీనత వీడి, తెలంగాణ ప్రాంత ప్రజల చట్టబద్ధమైన నీటి హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కార్యాచరణతో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర సీనియర్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.


