రాజేంద్రనగర్: ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అత్తాపూర్ సీఐ ఏ.సీతయ్య సూచించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని చింతల్ మెట్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్లో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ సీతయ్య మాట్లాడుతూ, సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వాడకంలో తీసుకోల్సిన జాగ్రత్తలు, అపరిచిత లింక్లు క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత వివరాలు మరియు ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటానికి నిరంతర అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు.
ఏదైనా సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరించారు. విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ సూత్రాలను తెలుసుకోవడమే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు మరియు చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


