హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రయాణంలో భాగంగా తెలంగాణ మంత్రివర్గం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ భేటీలో నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ వైద్య రంగంలో వేలాది ఉద్యోగాల భర్తీకి, హైదరాబాద్ నగర సుందరీకరణ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.


వైద్య రంగంలో మెగా నియామకాలు: 6,278 పోస్టులు మంజూరు
ప్రజలకు కార్పొరేట్ పిచ్ వైద్య సేవలు ఉచితంగా అందించే సంకల్పంతో కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల బలోపేతానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సనత్ నగర్, ఎల్.బి. నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు: మొత్తం 6,278 పోస్టులలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.
నిమ్స్ తరహా అభివృద్ధి: ఈ ఆసుపత్రులను నిమ్స్ (NIMS) ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఇక్కడ అందించే అత్యవసర వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎల్ఓసీ (LOC) లు కూడా జారీ చేయనున్నారు. 

మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్-1 పనులకు రూ.7,345.12 కోట్లు
నగర ముఖచిత్రాన్ని మార్చే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనులకు మంత్రివర్గం ఆర్థిక అనుమతులు ఇచ్చింది. మొదటి విడతలో భాగంగా 21 కిలోమీటర్ల పొడవునా నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రూ.7,345.12 కోట్ల విలువైన పనులను ఆమోదించారు.
పనుల పరిధి: హిమాయత్ సాగర్ నుండి ఈసా ప్రవాహం, ఉస్మాన్ సాగర్ నుండి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుండి బాపూఘాట్ వరకు ఈ సుందరీకరణ పనులు జరుగుతాయి.
కొత్త పోస్టుల ఏర్పాటు: ఈ ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ కోసం నూతనంగా 147 పోస్టులను సృష్టించడంతో పాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించనున్నారు.

బడులు, కాలేజీల సిబ్బందికి ఉచిత మధ్యాహ్న భోజనం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా ప్రభుత్వం అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని వర్తింపజేయనున్నారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందుతుందా లేదా అనే జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా దాదాపు లక్షన్నర మంది సిబ్బందికి ఈ సదుపాయం కల్పిస్తున్నారు.

విద్యా సంస్థలు, గిడ్డంగులకు ప్రభుత్వ భూములు కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, విద్యా వసతుల విస్తరణకు క్యాబినెట్ పెద్దపీట వేసింది.
గిడ్డంగుల నిర్మాణం: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (TGSWC) కు వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కన్యాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాల భూమిని మార్కెట్ రేటు ప్రకారం కేటాయించారు.
నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు: మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని జవహర్ నవోదయ విద్యాలయాల కోసం కేటాయించారు. అలాగే జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని ఖరారు చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST