తిరుమల: తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన ఆధ్యాత్మిక పవిత్ర స్థలమైన నారాయణగిరి శిఖరంపై ఆదివారం ఛత్రస్థాపనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణగిరిలోని శ్రీవారి పాదాల చెంత టీటీడీ అర్చక బృందం, ఆలయ అధికారులు కలిసి ఈ విశేష కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
మంగళవాయిద్యాలతో నారాయణగిరికి ఊరేగింపు
ఈ ఉత్సవంలో భాగంగా ముందుగా శ్రీవారి ఆలయంలో రెండో గంట నివేదన అనంతరం పూజ సామగ్రి, పుష్పాలు, నైవేద్యం మరియు ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును మంగళవాయిద్యాల నడుమ మాడ వీధుల గుండా మేదరమిట్టకు, అక్కడి నుంచి నారాయణగిరి శిఖరానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం శ్రీవారి పాదాలకు అర్చకులు విశేషంగా తిరుమంజనం (అభిషేకం) నిర్వహించి, దివ్య అలంకారం చేసి ప్రసాదాలను నివేదించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర సమర్పించగా, విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
పురాణ ప్రాశస్త్యం, వాయుదేవునికి ప్రార్థన
కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు తిరుమలలో మొదటగా అడుగుపెట్టిన పవిత్ర ప్రాంతం నారాయణగిరి శిఖరమేనని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, ఈ కాలంలో నారాయణగిరి కొండపై బలమైన గాలులు వీస్తుంటాయి. గాలుల తీవ్రత నుంచి ఉపశమనం లభించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ అర్చకులు ఇక్కడ గొడుగు (ఛత్రం)ను ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలో టీటీడీ ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.


