హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాజధాని కోర్ అర్బన్ రీజియన్ పరిధి (CURE) లో తాగునీటి సరఫరా సేవలను మరింత బలోపేతం చేసేందుకు జలమండలి (HMWSSB) లో భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. వాటర్ బోర్డులో ఖాళీగా ఉన్న మొత్తం 965 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు జారీ చేసింది.

క్షేత్రస్థాయి సిబ్బంది కొరతకు చెక్..
జలమండలి ప్రస్తుతం క్యూర్‌ పరిధిలోని మూడు రీజియన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లలో విస్తృతంగా సేవలను అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందే ఉండటంతో పర్యవేక్షణ లోపించి, సేవల నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరంతర నీటి సరఫరా, మెరుగైన సేవల కోసం పోస్టులను మంజూరు చేయాలని జలమండలి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ఏయే పోస్టులంటే..?
ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 965 కొలువులలో.. ఇప్పటికే 230 ఇంజనీర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. వీటికి అదనంగా క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన లైన్‌మెన్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్ల కేటగిరీలలో మరో 735 పోస్టుల భర్తీకి తాజాగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం 965 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కాకుండా, పారదర్శకంగా టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా భర్తీ చేయడానికి అధికారులు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST