హెల్త్ డెస్క్: రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా పాలు తాగడం వల్ల రాత్రి వేళల్లో నిద్ర బాగా పడుతుందని అందరూ భావిస్తారు. అయితే ఇదే పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకుని తీసుకోవడం వల్ల ఊహించని రేంజ్‌లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

హైబీపీ నియంత్రణ.. గుండెకు రక్షణ
జాజికాయలో ఉండే ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలోని లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా జాజికాయలో ఉండే పొటాషియం గుండె స్పందన రేటును క్రమబద్ధీకరించడమే కాకుండా, రక్తపోటు (హైబీపీ) స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.
నిద్రలేమి, ఆందోళన దూరం
జాజికాయలో 'మైరిస్టిసిన్' అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది మనోల్లాసాన్ని కలిగించి మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఈ పాలు తాగడం వల్ల మెదడులో 'సెరోటోనిన్' అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసి ప్రశాంతమైన మానసిక స్థితిని ఇస్తుంది. దీర్ఘకాలంగా నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యతో బాధపడేవారికి ఇది ఒక చక్కటి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
జాజికాయలో ఉండే శోథ నిరోధక గుణాలు, యాంటీఆక్సిడెంట్లు జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఇందులోని నొప్పి నివారణ గుణాలు బాడీకి మంచి విశ్రాంతిని ఇస్తాయి.
ముఖ్య గమనిక:
జాజికాయ పొడిని పాలల్లో చాలా తక్కువ మోతాదులో మాత్రమే వాడుకోవాలి. కేవలం చిటికెడు పరిమాణంలోనే దీనిని తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే అది విషపూరితంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read latest Health News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST