బీజింగ్/టోక్యో: తూర్పు ఆసియా రాజకీయాల్లో చైనా, జపాన్ దేశాల మధ్య దౌత్యపరమైన మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు ఆర్థిక ఆంక్షల యుద్ధంగా మారింది. జపాన్కు చెందిన 20 ప్రముఖ సంస్థలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా కఠినమైన ఎగుమతి సంబంధిత ఆంక్షలను విధించింది. దీనికి తోడు మరో 20 జపాన్ కంపెనీలను అత్యంత నిఘా ఉంచే ‘వాచ్ లిస్ట్’ లో చేర్చడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఈ తాజా ఆంక్షల ప్రకారం.. పౌర (Civilian) , మిలటరీ (Military) అవసరాలకు.. అంటే రెండింటికీ ఉపయోగపడే చైనా తయారీ వస్తువులను గానీ, సాంకేతికతను గానీ సదరు జపాన్ సంస్థలకు విదేశీ ఎగుమతిదారులు సరఫరా చేయడానికి వీల్లేదు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య అంతర్గత ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, చైనా తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం జపాన్ పారిశ్రామిక రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామంతో అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) పై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


