హైదరాబాద్: భారతదేశ బ్రిక్స్ (BRICS) అధ్యక్షత-2026 నేపధ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా 'రెండవ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్' మరియు 'బ్రిక్స్ అసెట్ రికవరీ ఎక్స్పర్ట్ నెట్వర్క్' సమావేశాలు ఆగస్టు 4, 5 తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, నిలకడ" అనే ప్రధాన ఇతివృత్తంతో జరిగిన ఈ రెండు రోజుల సదస్సుకు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నుండి సీనియర్ విధానకర్తలు, ఆర్థిక నిఘా వర్గాలు, చట్ట అమలు సంస్థల నిపుణులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సమావేశాలను DoPT కార్యదర్శి రచనా షా ప్రారంభించారు. అవినీతిపై భారతదేశం అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' (సున్నా సహనం) విధానాన్ని ఆమె ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి మరియు ప్రజా విశ్వసనీయత సాధించడంలో పారదర్శకత, సాంకేతిక ఆధారిత పాలన అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడి విదేశాలకు పారిపోయే నేరస్థులను పట్టుకోవడం, అప్పగించడం మరియు వారి అక్రమ ఆస్తులను జప్తు చేయడం కోసం అంతర్జాతీయ సరిహద్దుల పరిధి దాటి భాగస్వామ్య దేశాల మధ్య సమాచార మార్పిడి వేగవంతం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
సమావేశంలో భావి విదేశీ నేరస్తుల అప్పగింత కోసం అనుసరించాల్సిన విధానాలు, సరిహద్దుల దాటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారి డేటాను సేకరించే 'రైట్ఫుల్ రిపోజిటరీ' వ్యవస్థను పటిష్టం చేయడంపై సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అలాగే పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, డిజిటల్ సేకరణ ప్లాట్ఫారమ్లను ఉపయోగించడం ద్వారా అవినీతిని ముందుగానే గుర్తించి నివారించవచ్చని చర్చించారు. ఫిన్టెక్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో) వంటి ఆధునిక సాంకేతికతల దుర్వినియోగాన్ని అరికట్టడానికి బలమైన చట్టపరమైన నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు.


